తెలుగు సంగతులు

మంగళవారం, మార్చి 29, 2011

పరికిణి


మంచి రచయితలనే వాళ్ళు కూడా చాలామంది కధో, కధా సంకలనమో వ్రాసి ముఖచిత్రం బాపు గారి చేత వేయించుకోవాలని ఎంత ఉవ్విళ్ళూరుతారో, అంతే భయపడ్తారట. ఎందుకంటే మొత్తం పుస్తకాన్ని ఆయన బొమ్మ మింగేస్తుందనట. అలాగే ఓలేటి శ్రీనివాస భాను వ్రాసిన  పుస్తక సమీక్ష చదివితే అదే గుర్తుకొస్తుంది. ఆ సమీక్ష నన్ను అప్పట్లో విశాలాంధ్ర వగైరా షాపులకు తరిమింది గాని పుస్తకం దొరకలేదు. తనికెళ్ళ గార్కి ఉత్తరం రాశాను గాని, భాగ్యానికి నోచుకోలేదు. ఇన్నాళ్ళకి దొరికింది. బహుశా పదేళ్ళ కిందటిదేమో వోలేటి గారి సమీక్ష- ఈనాడులో వచ్చింది. ఉత్సుకత కొద్దీ ఇక్కడ ఇస్తున్నాను. 'పరికిణి' కొని చదివాక అప్పుడు జాగ్రత్త పెట్టిన ఆ పేపర్ కటింగు ఇప్పుడు బయటకు తీశాను. ముందు మచ్చు తునకగా ఒక కవిత చదివి అప్పుడు సమీక్ష చదివితే, అలాగే పుస్తకం కొనుక్కొని మొత్తం చదివి ఒకటి జాగ్రత్త పెట్టుకొని, ఒకటి ఆత్మీయులకెవరికన్నా బహుకరించుకుంటే బావుంటుంది.
చీరె
రాత్రివేళ ఊరిస్తూ-జారుతూ
శృంగారం వొలికిస్తుంది
తెల్లారగట్ల ఆదరాబాదరాగా-అస్తవ్యస్తంగా
వొంటికి చుట్టుకున్నప్పుడు
హాస్యాన్ని చిలికిస్తుంది!
పుట్టింటివాళ్ళ దగ్గర్నుంచి
కబురొస్తే చాలు కళ్ళొత్తుకుంటూ...
కొంగంతా కరుణరసం వర్షిస్తుంది!!
నీళ్ళ టాంకర్ వీధిలోకొస్తే
బిందెకి సపోర్టింగా నడుమ్మీదకు చెక్కేసి
వీర రసాన్ని ప్రదర్శిస్తుంది
పనిమనిషి 'నాగా'పెడితే
బొడ్డులోకి దోపీ అంట్ల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది
మొగుడితో గొడవపడ్డ రోజున
నేలమీద చెంగై పరచుకొనీ
భయానకాన్ని- రుచి చూపిస్తుంది
అకారణంగా పతిదేవుదు తిట్టాడా --
దూలానికి వేళ్ళాడుతూ
భీభత్సాన్ని... సృష్టిస్తుంది
పొరపాటయిందే అని బేలగా భర్త కన్నీరు పెట్టాడా !!
అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది!!
రాజీకొస్తే చాలు మల్లెవంతి తెల్లని ఉల్లి పొరై
శాంతరసాన్ని ... ప్రసాదిస్తుంది!
ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావొద్వేగంతో
రెపరెపలాడే పతాకంలాంటి చీర !
పది నెల్లు తిరిగేసరికి  పండంటి పాపాయిని
గుండెల్లో పెట్టుకొని  మాతృ గర్వంతో ఊగిపోతూ
ఉయ్యాలైపోతుంది !!!       
తనికెళ్ళ భరణి. 'పరికిణీ'నుండి..
"నటుడుగా, నాటక రచయితగా ప్రసిద్ధుడైన తనికెళ్ళభరణి తానో మంచి దర్జీనని ఇందులో నిరూపించుకున్నారు. ఆయన కుట్టిన ఈ పరికిణి కి పాతిక కుచ్చిళ్ళున్నాయి. అతుకులు వేసిన మధ్య తరగతి జీవితాన్ని పట్టీలా అమర్చి చెంబు ఇస్త్రీ చేసిన ఈ వస్త్రం నిండా జాడవిరిచిన స్వప్నాలు, రంగు వెలిసిన సత్యాలూ కనిపిస్తాయి. వీటిని చూశాక "జీవితాన్ని అందరూ చూస్తారు. హత్తుకునేలా కొందరు మాత్రమే రాస్తారు" అని తప్పక అనిపిస్తుంది. తెలిసిన ఉపమానాల్ని తేలికైన మాటలతో గుదిగుచ్చి విషయాన్ని విస్పష్టం చెయ్యడంలో అద్భుతమయిన ఫ్లూయన్సి ప్రతీ కవితలోనూ కనిపిస్తుంది. సమస్యల జ్వాలామాలాతోరణం మధ్య, ఆలి తాలూకు అమాయకత్వం మీద తాండవమాడే మధ్య తరగతి నటరాజును చూపించిన కవి, కలల జాడీలో అష్ట దిక్పాలకుల చేత ఆవకాయ కలియబెట్టించారు. అరుగు మీద పేలు చిక్కుకుంటూ ఉప్పందించే ఆడపడుచులు, సరిగా తోడుకోని జీవితాన్ని చిలుకుతూ విభూది పండైపోయిన బామ్మలూ, రెండు మూరల మల్లెల కోసం పాలకూరనో, కొత్తిమీరనో వాయిదావేసి, ఏడాదికో పూటైనా నులక మంచంమీద మొగుణ్ణి అనిపించికోవాలని ఆరాటపడే అతిసామాన్యులూ దిగుడు పంచల ఇంటి గోడల మీద దిగదుడుపు క్రీనీడల్లాగా కనిపిస్తారిందులో. చీరై పోయిన వోణీలూ, ముడైపోయిన వాలుజడలూ,  గుండెల్లో నిప్పులు పోసే మంగళ వాద్యాలూ – సగటు బతుకును మించిన ద్వ్యర్ధికావ్యం లేదని నిర్ద్వందంగా చెబుతాయి. మెదళ్ళు దాచే లాబ్ లాంటి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి, పరస్పర సర్పాల పడగెత్తి ఆడే హిపోక్రసీ, విద్యల తల్లిని నమ్ముకోక అమ్ముకొనే ప్రవృత్తి పఠితల్ని ఆలోచింపచేస్తాయి. మధ్య తరగతి స్త్రీ మూర్తి మీద అపారమైన గౌరవం, అంతులేని అభిమానాలు అనేక కవితల్లో ఉట్టిపడతాయి. ‘బామ్మ’, ‘స్వర్గం నుంచి నాన్నకి’, ‘చీరె’, ‘పరికిణి’, ‘మా ఆవిడకి మంత్రాలోచ్చు’ లాంటి కవితలే ఇందుకు ఉదాహరణ. అలాగే ‘రామప్ప గుడి’, ‘మూసీ నది’, కుంకుమపువ్వుల మీద భరణి రాసిన పంక్తులు కదిలిస్తాయి. కవి తన ఆరాధ్య నటి సావిత్రి, అభిమాన నటి రేఖల గురించి రాసిన మాటలు నిట్టూర్పుల తాకిడికి ఊగే జడగంటల్లాగా అనిపిస్తాయి. మొదలు పెట్టినా తరువాత పాతిక కవితల్నీ ఏక బిగిన చదవందే మనసు ఊరుకోదు. అక్షరాల అద్దంలో ప్రతిబింబం మసకేసిన ప్రతిసారీ కన్నీటి పొరను తొలగిస్తూ పేజీలు తిరగెయ్యడం పఠితలకు తప్పనిసరి అవుతుంది. తెలిసిన సంగతుల్ని కదిలించేలా చెప్పడానికీ – క్లుప్తత, ఆర్ద్రత, జీవితాన్ని ప్రేమించే గుణాలే కారణమన్న సంగతి బోధపడుతుంది. గంగను భగీరధుడికిచ్చి, కన్నీటిని భారతీయులకిచ్చిన పరమేశ్వరుడికి కవితతో పాటూ  పాఠకులు సైతం కృతజ్ఞతలు చెప్తారు. పుస్తకం ముగించగానే లక్ష్మణ్ ముఖచిత్రం, బ్నిం లే అవుట్ ఈ పుస్తకానికి ఎసెట్లు.
(పరికిణి : రచన: తనికెళ్ళభరణి, పేజీలు 36, వెల రూ:20/-, ప్రతులకు – రచయిత, 8-3-678/6, సౌందర్యలహరి, ప్రగతి నగర్, యూసుఫ్ గూడ,హైదరాబాద్-500045.)

సోమవారం, మార్చి 28, 2011

విసుర్లు

మానవుడు-పరిణామక్రమం,  కుటుంబం –సమాజం-సంఘం, ప్రభుత్వం-ప్రజాస్వామ్యం ..... ఇవన్ని చదివినదాన్నిబట్టి అర్థం అయినట్టే ఉంటుంది. మానవుడు ‘అభివృద్ది’ అన్న ఊర్ధ్వ దశవైపుకు వెళ్తున్నాడా? ఆ పేరున అధోలోకాల దారిలో ఉన్నాడా? సర్వమానవ అభివృద్ది, సమాన అవకాశాలు ఏ మాత్రం సాధించలేకపోయాం. కనిసం ఆ దిశలో అయినా పయనిస్తున్నామా అంటే అందరికి అనుమానమే!  ఇంక ‘అభివృద్ధి’ అన్న మాటకు అర్థం ఏం ఉంది? వృద్ది జరుగుతూ ఉంది—జనాభా పెరుగుదలలో, కొత్త వస్తువుల ఉత్పత్తిలో, వినిమయం లో, వృధాలో వృద్ది జరుగుతోంది. ఇది కాదనలేని నిజం. దీనినే ‘అభివృద్ది’ అందామా?
ఇలాంటి అభివృద్ది మత్తులో పడి మానవుడు ప్రకృతికి, మనస్సుకి,ఆత్మకి చివరకి తనకు తనే దూరమవుతున్నసూచనలు కనిపిస్తున్నాయి. వికృత చేష్టలు,విపరీత బుద్ధులు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం కొంచెం విశ్లేషించుకున్నా,మన రోజువారీ పనులలో కనిపించేవి చాల మట్టుకు ఈ వికృత చేష్టలు, ఆలోచనలే!  
చెట్టున వికసించి నీరెండలో పిల్లగాలులకు తలలూపే రంగు రంగుల పూలను తెంచి తుంచి గుచ్చి దేవునికి అర్పణ పేరుతో వాడబెట్టేయడం వికృతం కాదా? ఏ లోపం లేకుండా,అన్ని అవయవాలతో పుట్టి, అన్ని అవకాశాలు ఉన్నా--- స్వేచ్ఛ పేరుతో మితి మీరిన విశృంఖలత్వం వైపుకు మొగ్గుతున్న యువతకు ఎవరు బాధ్యులు? సహజసిద్ధమయిన నిర్మలత్వంతో కుసుమించిన ఆ పసిపాపలను, గొప్పదనం పేరుతో, ఎత్తుసంఘం (high society), ఎత్తుగడల సంఘంలోని పెద్దలు,తల్లిదండ్రులు అతిపోకడలతో విషపూరితం చెయ్యడం జరుగుతున్న తీరును విశ్లేషించుకుంటే—అర్ధమయ్యే ఆశ్చర్యమయిన సంగతుల్ని పరిశీలించుకుందాం.
రంగురంగుల పూలను మన స్వార్ధంకోసం గుది గుచ్చిన దండఎలా వాడిపోతోందో?-- భావి పౌరులను  మన కోర్కెల కోసం గొప్పలకోసం మూర్ఖత్వంతో  సమాజానికి గుది బండగా ఎలా తయారు చేస్తున్నామో?? అహాన్ని పక్కకు పెట్టి ఆలోచిద్దాం.      
పెద్ద్దలు సంవత్సరానికోసారి, నల్లదో లేక పసుపుదో వేషం ధరించి చేసిన పాపం భజనలతో సరీ! అని భావించడం ఒక ఎత్తు అయితే-- పిల్లలు ఏ రంగంలో వెనుకబడ్డా, వారిని పూజలు,మొక్కులు, జాతకాల పేరుతో తిప్పి వ్వారి వ్యక్తిత్వాన్ని ఎదుగుదలను, జవాబుదారీతనాన్ని మొత్తంగా తుడిచేస్తుండడం కళ్ళకు కట్టే పచ్చి నిజం. ఆ యువకులకు తమ గురించి, తమ శక్తి సామర్ధ్యాల గురించి అవగాహన, ఆత్మవిశ్లేషణ కలుగకుండా అడ్డుపడి సామర్ధ్యం పెంపు కాకుండా, కానరాని అదృష్టంవైపుకు దృష్టి మళ్ళించడం –వారు మళ్ళి మలితరానికి ఇవే జాడ్యాలను కొనసాగించడం.. బిర్లా మందిరాలు , వీసా దేవుళ్ళు, అత్యాశ ప్రదక్షిణాలు దైవం పట్ల కనీసఅవగాహన ఉన్నవారెవరైనా ప్రోత్సహిస్తారా? మానసిక స్వేచ్ఛ, ఎదుగుదలకు, మనిషి జీవితంలో క్రమానుగత పరివర్తనకు ఇవన్ని ముమ్మాటికి అవరోధాలే. ఆధ్యాత్మికత స్థానంలో ఆడంబరాలు, అసూయా ద్వేషాలు, అల్పగుణాలు తమదైన మూర్ఖత్వంతో రుద్దడమే కాకుండా అదే అసలైన భక్తి భావమనే విపరీత పోకడలకు గురిచేస్తున్నది పెద్దవాళ్ళే. పసుపు కుంకుమ వేపరొట్టలు,జంతుబలులు,చిందులు,శివాలు—పట్టు పీతాంబరాలు, అబిషేకాలు, అగ్నిహోత్రాలు యజ్ఞాలు,యాగాలు—రోడ్డుపై  కొబ్బరి కాయలు పగల గొట్టుడు(ఆకలితో ఉన్న వాడు కూడా తినలేని విధంగా), వెంట్రుకల తాళ్ళు, నిమ్మ కాయలు--- సమాజంలోని స్థాయిబేధాన్నిబట్టి పద్ధతి మారొచ్చుగాని- అంతరార్ధం,పరమార్ధం ఒక్కటే! చేసిన తప్పుల్ని పాపాల్ని కడిగేసుకోవడం – మళ్ళి మళ్ళి చేసేందుకు పర్మిట్టు, అర్హతకు కష్టానికి మించిన ఫలితంకోసం అత్యాశ.
మన మీద మనకు ఆత్మ విశ్వాసం పెంపొందించి, సమాజంలో క్రమశిక్షణతో జీవించడానికి తోడ్పడవలసిన దీక్ష,పూజ వంటి ప్రక్రియలు ఇప్పుడు సత్ప్రవర్తనకు ప్రతిబంధకాలుగాను, అన్యాయపు నడవడికలకు అధీకృతచర్యలు గాను పరిణమించాయి. మోటారు సైకిల్కి పూజ చేయించి, నిమ్మకాయ కట్టేసి, జరీ వస్త్రపు ముక్కను హాండిల్ కి కట్టేస్తే – ఇక ఏం ఫర్వా ఉండదు అనే భావనతో అతి వేగంతో వెళ్లడం, ముగ్గురు ఎక్కి నడపడం, నిబంధనల్ని అతిగా అతిక్రమించడం మనం నిత్యం చూస్తున్నాము. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! మైకులతో హోరెత్తించే భజనలు, ఒకరికి మించి మరొకరు దర్పం కోసం చేసే పోటీ దీక్షలు, పవిత్ర స్థలమని ముద్రవేసిన దగ్గరే అశ్లీల నృత్యాలు,రాజకీయుల సౌజన్యాలు, వీటన్నిటికి ప్రచారంకోసం రోడ్లకు అడ్డంగా కట్టే ప్లాస్టిక్ బానర్లు (ఫ్లెక్సీలు ఇప్పుడు బాగా చవక కదా) ఇలా చెప్పుకుంటూ పొతే అంతు దరి లేనంత అరాచకం. ఇవన్ని ఏం పేరు చెప్పిచేస్తున్నాం?..  ఒక్కసారి ఎవరికి వారే ఆలోచిద్దాం.
అందరికీ విద్య అవసరం.-- అది కూడా జ్ఞానాన్నీ, తోటి మనిషి పట్ల గౌరవభావాన్ని, సమాజం పట్ల జవాబుదారీతనాన్ని పెంపొందించగలిగేది అయి ఉండాలే గాని-- గుమాస్తాల్ని బలవంతపు/వరకట్నపు ఇంజనీర్లను గానీ  తయారుచేసేది కాకూడదు.- అప్పుడే ఈ రుగ్మతలకు నివారణ సాధ్యం.           
రాజా.