తెలుగు సంగతులు

గురువారం, డిసెంబర్ 29, 2011

బద్ధకపు అభివృద్ది-మధ్యతరగతి బుద్ధి.





ఆయనెవరో కోట్ చేసినట్టు “అభివృద్ధికి నిర్వచనం మరింత బద్ధకంతో ఎక్కువ కార్యాల్నీ, సౌకర్యాల్నీ సమకూర్చుకోవడం”.  ఇదేదో వింతగానో వెగటుగానో  అనిపించవచ్చుకొందరికి. కాని తరచి చూస్తే వాస్తవమే  గోచరిస్తుంది.  ఉదాహరణకి టివి రిమోట్, రిమోట్ బొమ్మలు, ఇంట్లోనుంచే అంతర్జాలం (internet) ద్వారా బాంకు లావాదేవీలు, ప్రయాణ ఏర్పాట్లు, షాపింగులు  వగైరాలన్నీ. ఇక్కడ ఒక మేధావి విశ్లేషించిన అభివృద్ది మెట్లను మననం చేసుకోవడం సందర్భోచితం అవుతుంది. గత రెండు శతాబ్దాలలో ప్రపంచ అభివృద్ది ప్రధానంగా మూడు సాంకేతిక దశలుగా అభివృద్ది  చెందింది. అవి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రానిక్ రంగాలు. 
 కానీ  ఈ అభివృద్ధి అనబడే ప్రతి మెట్టు నిర్మాణానికి ఎంతమంది పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, శ్రామికులు వారి వారి మేధను, శ్రమను  వెచ్చిస్తే – అందరికి ‘బద్ధకంగా పనులు చక్కబెట్టుకొనే అవకాశం చిక్కుతోంది? కాని మనకి వారెవరినీ గుర్తించే తీరిక, విజ్ఞత ఉండడం లేదు. అవసరం అనిపించడం లేదేమో బహుశా! ఎందుకంటే చాలా అభివృద్ది అంశాలకు, వాటి ఫలాలకు ఖరీదు కట్టి చెల్లిస్తున్నామనే లోలోపలి అభిప్రాయం కావచ్చు. కొంతవరకూ వాస్తవమే. కాని ప్రతి పరిశోధకుడు, కర్షకుడు, కార్మికుడు తగిన ప్రతిఫలాన్ని పొందడం లేదన్న వాస్తవాన్ని గుర్తించే స్థితిలో సమాజం లోని సింహభాగం లేకపోవడం కఠిన వాస్తవం.   ఈ ‘సింహ భాగం’ లో ఒకప్పుడు ఉన్నత వర్గాలుగా పిలవబడే అధికాదాయ, భూస్వామ్య వర్గాలు మాత్రమే ఉండేవి. కాని రాను రాను మధ్య తరగతి కూడా చేరడం కాస్తంత చేదు నిజం. ఈ మధ్య తరగతి లో కూడా,కొన్ని రకాల  తొత్తు గాళ్ళు మాత్రమే ఉన్నత వర్గాలకు సై కొడుతూ--- శ్రామిక శక్తిని, మేధస్సును గుర్తించడానికి ఒప్పుకోనివాళ్ళు ఉంటారు. వీళ్ళు సాధారణంగా కొన్ని వర్గాలకు చెంది ఉంటారు.  ఉదాహరణకు --  పలుకుబడి ద్వారానో, కులం మద్దత్తు తోనో ప్రభుత్వోద్యోగాలు పొందిన వారు, మార్కెట్ల మార్పుతో  గాలి వాటు లాభాలు పొందిన వాళ్ళు, నాయకుల వెంబడి తిరిగి లబ్ది పొందే వాళ్ళు, మధ్యవర్తిత్వాలు చేసే బ్రోకరు గాళ్ళు , సారా పాటగాళ్ళు, క్లబ్బులు- లాటరీలోళ్ళు, రౌడీలు – దందా గాళ్ళు, చిన్న మొత్తాలను పెద్ద వడ్డీలకు తిప్పేవాళ్ళు, గల్లీ లీడర్లు, ఓట్లు కొనే వాళ్ళు, కల్తీ గాళ్ళు, లంచాలోళ్ళు, ఆర్.టి.ఏ. – రిజిష్ట్రారు ఆఫీసుల దగ్గరుండే రాతగాళ్ళు(అంటే లోపలి ఆఫీసర్లకి బయటి కలెక్షను గాళ్ళు), మతం పేరుతో- దేవుడి పేరుతో అమాయకులను దోచుకునే వాళ్ళు--- వగైరా ‘కొంచెం శ్రమ తో (లేదా అసలు శ్రమ లేకుండా) ఎక్కువ సొమ్ము’  నొల్లుకునే రకం జనమన్న మాట. అంతేగాని, నిజాయితీగా పని చేసుకొనే అసలు సిసలు జనం కాదు.  ఈ రకంగా మధ్య తరగతి, మద్యం తరగతి తొత్తు గాళ్ళ  మద్దత్తుతో, మధ్యవర్తిత్వంతో  -- దోపిడీ చేసుకునే పాలకవర్గాలు విశృంఖలంగా జాతి సంపదను మెక్కేస్తున్నాయి.  అందుచేత పెద్ద నేరగాళ్ళను దోపిడిగాళ్లను అదుపు చెయ్యాలంటే మనలో, మన మధ్యలో, మన వెంటే ఉన్న దళారి గాళ్లను కనిపెట్టి పని పట్టాలి. పెద్ద దోపిడీదారులు ఎప్పుడూ సామాన్య జనానికి ముఖా ముఖి రారు. మనలోనే ఉండే ఈ మధ్యవర్తి తొత్తు కొడుకుల్నేఅడ్డం పెట్టుకొని మన సంపదను దోచుకుంటారు.
ఈ మధ్యవర్తిగాళ్ళే మొత్తం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళుగా చలామణి అవుతుంటారు. దేవుడికి ఏం మొర పెట్టుకోవాలన్నా పుజారిగాళ్ళు తప్పనిసరి అని భక్తుల్ని మభ్యపెట్టగలిగే తెలివితేటలు మన దోపిడీదార్లవి.
దీనికి పరిష్కారం ఉందా? ఎందుకుండదు. మన మధ్యలోనే ఉందికదా! ఈ బ్రోకరుగాళ్ళను అదుపు చెయ్యాలంటే, జనం విద్య నేర్వాలి. అది స్కూలు లో నేర్పే విద్య కాదు. మన హక్కుల్ని మనం గుర్తించగలిగే విజ్ఞత. దానిని కాపాడుకునే బాధ్యతా. దానికోసం ఎదురునిలబడే సత్తా. సమాచార హక్కు చట్టం ఆసరాతో చిన్న తీగలాగితే కదిలిన పెద్ద డొంక -- 2జి కుంభకోణంలో ఎంతమంది ఘరానా గాళ్ళు ఊచలు లెక్కబెడుతున్నారు? ఒక్క ప్రజాప్రయోజన వ్యాజ్యం తో ఎంతమంది ప్రముఖులు, ఘనులు ఇప్పుడు చిప్పకూడు తినడం లేదు?   అందుచేత కావాల్సింది కాస్తంత భాద్యత, విజ్ఞత,చొరవ మరి కాస్త తెగువ. చాలామంది బొక్కుడుగాళ్లను బొక్కలో వెయ్యొచ్చు.
ఈ మధ్యవర్తుల ప్రమేయం జనజీవితంలో ఎంత పొందికగా ఒదిగిపోయిందంటే – మనకే స్పృహకు రానంత—దళారి లేకుండా స్కూలు అడ్మిషన్ దగ్గరనుండి, రేషనుకార్డు, జననమరణ సర్టిఫికేట్, ‘అనా’రోగ్యశ్రీ  వైద్యం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, మునిసిపాలిటీ చెత్త కంప్లయింటు, ఓటరు నమోదు, టాక్సులు, రిజిస్ట్రేషన్లు, ట్రాఫిక్ చలాను--- మహాప్రభో!! ఇందుగలడందు లేడని సందేహం అక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే అసలు బ్రోకరుగిరీ దేవుడి దగ్గరే మొదలయ్యిందనిపిస్తుంది.  పంతులు లేకుండా, మంత్రాలు చెప్పకుండా బిడ్డలకు పేరు పెట్టుకోవడం దగ్గరనుండి, తలనీలాలు (నెత్తి మీద బొచ్చు) ఇచ్చుకోవాలన్నా, పెళ్లి, శోభనం( అవును – దానికి మంత్రాలు, పూజలు, ముహూర్తం కూడాను), చావుకి సరే సరి తరతరాలు తద్దినాలు పేరుతొ పంతుళ్ళకు పొత్తర్లు ఇవ్వడమే గాని – మనకు మనం గా పెద్దల్ని తలచుకోలేని దుస్థితి. దేవుడి సంగతైనా, ప్రభుత్వం సంగతైనా మధ్యవర్తుల్ని తప్పించాలి. భక్తులకి, ప్రజలకి అందవలసినవి వరాలు కాదని, మనకు దక్కాల్సిన హక్కులని అర్ధం అవ్వాలి. మనం – మన దేవుడు, మన గోడు, కోరికలు మనం ఇష్టం వచ్చిన రీతిలో ఆయనకు తెలిసే విధంగా (మనకొచ్చిన, నిజాయితీ తో కూడిన భాషలో) చెప్పుకోవాలి. మన దేవుడే అయితే, అడిగేది సబబైనదైతే ఇచ్చి తీరతాడు. దాన్ని మనోబలంతో సాధించుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల విషయం మరి ---  వారి కర్తవ్యం వారునెరవేర్చాలి  అంటే – ఆ కర్తవ్యం ఏమిటో, దానికి మనం వారికి అప్పగిస్తున్న బాధ్యత ఎంత, వారు గుంజుకుంటున్న అధికారం ఎంత, వారిపై అవుతున్న వ్యయం ఎంత, అదనంగా కూడ బెడుతున్నసంపద ఎలా వస్తోంది, ఆదాయానికి మించిన ఆస్తులు లెక్కలేస్తే – ప్రపంచంలోని ఏ ఆడిటింగు సంస్థా తేల్చలేనన్నిరకరకాల సంపదలు, వగైరా అన్నీ -- ఎన్నుకున్న మనకు అర్ధం కావాలి – అర్ధం చేసుకోవాలి. అంతవరకూ నిష్కృతి లేదు. మరో ఈజిప్టు గానో, టునీషియా గానో వీధికెక్కాల్సిన అవసరం మన భరతజాతికి రాకూడదంటే, ఇప్పటికయినా మేలుకోవాలి.  
నాలుగు దశాబ్దాలకు పైగా మూలుగుతున్న లోక్ పాల్ బిల్లుకు పార్లమెంటులో దక్కిన గౌరవం కళ్ళారా చూశాం కదా!  అనుకూలించావచ్చు, వ్యతిరేకించావచ్చు, అంతేగాని పలాయనం చిత్తగించడం ఎంతవరకు సబబు? అధికార, విపక్ష అనే బేధం లేకుండా ఇంత ముఖ్యమయిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు ఎగవేసే ప్రతినిధులకు ప్రజలు ఎలా బుద్ది చెప్పాలి? ఐదు సంవత్సరాలు ఆగాలా? ఈ లోపుగానే వారిపై అనర్హత ఓటు వేసే—కనీసం నిలదీసే  అవకాశం ప్రజలకు లేనప్పుడు ఇంకెక్కడి ప్రజాస్వామ్యం?టిక్కెట్టు ఇచ్చిన పార్టీ విప్ జారీ చేసినట్టే ముఖ్యమయిన బిల్లులకు/చట్టాలకు, రాజ్యాంగ సవరణలకు ఓట్లేసిన ప్రజలు విప్ జారీ చేసే విధంగా సంస్కరణలు చేసుకోలేమా? అసాధ్యం అంటారు ఆ గొప్ప గొప్ప ప్రతినిధులు, పెద్దలు, పార్టీలు. కాని మానవుని సామాజిక అవసరాలకొద్దీ ఎన్ని రకాల రాజ్యాంగాలు, చట్టాలు వ్రాయలేదు? ఎంతమంది మేధావులు, బహుళ జన ప్రేమికులు ఎంత శ్రమకోర్చి అవన్ని తయారు చేసుకుంటూ వచ్చారు? కాని ఇప్పుడు అధికారంలో, అనధికార అధికారంలో, సంపద దోపిడిలో ఉన్నవాళ్ళే చట్టాలకు దగ్గర చుట్టలుగా ఉన్నందుకు అవి జరిగే అవకాశం చాలా తక్కువ.  అందుకే ఇప్పటికైనా విప్లవాత్మకమయిన మార్పును ప్రజలు గట్టిగా కోరుకోవాలి. ప్రజలు ఐక్యం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఐక్యతాశక్తిని అందరం ప్రగాడంగా విశ్వసించాలి.