తెలుగు సంగతులు

మంగళవారం, సెప్టెంబర్ 10, 2013

నామినితో నా గోడు

నామినితో నా గోడు

ఏదైనా పుస్తకం చదివాక అది ఇంకా మనల్ని వెంబడిస్తోందంటే ఆ రచన మనల్ని కదిలించిందనో, కరిగించిందనో అనుకోవచ్చు. కానీ ఆ భావన ఎన్నాళ్ళు? ఆ తరుములాట ఎంత కాలం? మరో పుస్తకం చదివేదాకానో, లేదా మరో వ్యాపకంలో పూర్తిగా మునిగిపోయ్యే దాకానో! అంతేకాని, ఇదేటి ఈ నాయుడుగోరి గోడు సెవ్వుల్లో కాకుండా గుండెల్లో దూరిపోయి ఓ పట్టాన వదలకుండ పట్టేసినాది. అవును నిఝ్ఝంగా నిజెం. నామిని సుబ్రహ్మణ్యం గారి ‘నంబర్ వన్ పుడింగి’ చదివిన నాల్దినాలయినా జిగటలాగా వదలడంలేదు. పట్టింది మెదడుకి కాదు. మనసుకి కాబట్టి.  నిజం చెప్పాల్సిన బాధ్యత ఏ రచయితకైనా ఉంటుంది. ముఖ్యంగా చరిత్రలు, ఆత్మకధలు వ్రాసేటప్పుడు. కానీ నిజం మాత్రమే వ్రాయడం, అది మాత్రమే కలంలోంచి అలాగే పాకేయడం ఆయన  స్వతసిద్ధ లక్షణంగా నామిని ఆత్మకధలో చూస్తాం. అది చదివిన ప్రభావంలో ఉండగానే నామిని గారికే ఉత్తరం వ్రాసే దుస్సాహసం చేశాను. అదే ఈ కిందిది. ఆయన ఉత్తరం అందుకున్నట వెంటనే ఫోను చేసి చాలాసేపు మాట్లాడారు. చాలా సంబరపడిపోయాను. అసలే పుస్తకం చదివిన ఊపు, ఆపై ఆయనతో మాట్టాడిన పూనకం – ఇదిగో ఇక్కడ ఇలాగ బ్లాగేస్తున్నాను. చిత్తగించండి.
“ఎవడి సోది ఆడే ఆడి బాసలోనే దంచేత్త ఉంటే ఎట్టా సచ్చేది? పదిమంది సదవాలనే గదా ఎవుడయినా రాసేదీ? అచ్చోత్తేదీనూ? ప్రాంతం, మాండలీకం పక్కనబెట్టు. ఊరికో బాస యాస ఉండుద్ది గందా! పక్కూరోడికే అర్తం అయ్యేది కట్టవైపోతే ఎట్టా సదివేది? ‘రావి’  వద్దు – ‘కారా’ కాదు – ‘వంశీ’ కెందుకు – ‘చాసో’ కి చాతకాదు – కేశవరెడ్డికీ, పులికంటికీ ఏందెలుసని అంటావు!!! మరైతే నియ్యి దప్ప ఇంకేం సదవాల్రా? -- అనుకున్నా సగం సదివి. మిగతాయన్నీ సదవొచ్చుగానీ –ఇయ్యి, ఈ ‘పుడింగు’ గాడియ్యి మాత్తరం సదివితీరాలా- అనుకున్నా, పుస్తకం సివరాకరుకొచ్చేకల్లా. నీ పొగురు మాక్కూడా అతికించేట్టున్నావు కదరా ‘పుడింగీ’! అయినా నాకు అర్తం కాని సాలా సంగతుల్లో ఇదోటి—‘నీ అయ్యనొప్పించకుండా, ఎంట తీసికెల్లకుండా, పెల్లెట్ల సేసుకున్నావురా నంగిరి నా కొ---! ఇలాంటి పొగురుబోతు దొంగ పన్లెన్ని సేసినా – గొప్ప పాయింట్లే సెప్పినావు. అందులో ఒకటి –ముక్కెంగా – ‘ఎలచ్చంలప్పుడు కూడా ఆ నీ కొడుకులు డబ్బు దియ్యకబోతే – ఇంకెప్పుడు అది బయటకోచ్చేది?’ ఇది నిజెం. ఇదే నిజెం. ఇంతకంటే ఏ ‘పుడింగు’ అయినా సేసి సచ్చేది ఇంకేం లేదు. గింజల్తోలుకు పోయి నిలవెట్టిందాన్ని—సారాగా అన్నా మన మింద కొంచెం ఒలకబోయించేసుకుంటే --- ఆ నీ కొడుక్కి మల్లీ ఐదేల్లు పని ఉంటాది, గింజలేరుకుందికి. ఇయ్యి మాత్తరం మద్దేన్నం, రాతిరి క్వాటరు మీదే రాసింటావు. ఎక్కువయినందుకే లెక్క నేకండా డోకేసినావ్. అయినా కానీ ఒరే ‘పుడింగీ’ నువ్వు సెప్పినట్టే ఇన్నందుకు, నీకే తలూపినందుకూ అమ్మనీ, అక్కనీ ‘లంజముండలంటా’ వేందిరా? లమ్డిక్కీ! ‘లమ్డిక్కీ’ అంటే నాకర్తం తెలవదు. సోమరాజు రంగారావుకు మైకంలో తెలుత్తాదేమో! ఏదేవన్నాగానీ, నీ యెంబడి దిరిగిన పాపానికి సానా మందిని బజార్నెట్టేసినావు కదరా తిక్కలోడా! అయితేనేం – రోజుకు ఇరవై, ముఫ్ఫై పేజీలు కంటే ఎక్కువ సదవలేనోణ్ణి నీ రెండొందల పన్నెండు పేజీల ‘పుడింగి’ గోలమ్మటా రెండు రోజుల్లోనే పరిగెట్టిచ్చీసినావు కదరా! నువ్వు నిజంగా ‘పుడింగే’. అంతేనా! పిలకాయలకు  ఒక్క కతే చెప్పి ఆల్ల చేత నగిపిచ్చేసినావు సూడు, ఐదూ పదీ పెట్టి కొనిపిచ్చీసినావు సూడు అదీ మొగిలాయితనం అంటే! అందుకే అయ్యన్నీ ఎంటనే కొరియర్ కి పంపించు. నీ యబ్బ డబ్బు పంపిత్తన్లె యిప్పుడే. ఎకౌంటు నెంబరు యిచ్చి పూడ్సినావు కదా సివర్లో.
 మీలా పుడింగిని కాదు కానీ ఒక్కసారిగా మీ పుస్తకం చదివిన వెంటనే ఇంకా ఉండుకున్న పూనకం వల్ల ఇలాగ రాసేశాను నామిని సుబ్రహ్మణ్యం గారూ! క్షమించి మీ పుస్తకాలన్నీ దుకాణాల్లో దొరికేటట్టు సూడు సావీ!”
‘నామిని నంబర్ వన్ పుడింగి’
ప్రచరణ: టామ్ సాయర్ బుక్స్ , ప్లాట్ నెం:211, అన్నమయ్య టవర్స్,యాదవ కాలనీ, తిరుపతి – 517501.
ఫోను: 0877 – 2242102.

లభ్యం: విశాలాంధ్ర, నవోదయ. (ఉత్త మాట. ఎక్కడా లేవు. ఆయన్నే పట్టుకోండి.)